ఏలూరు టౌన్: ఏలూరు నగరంలో రద్దీ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా కార్యకలాపాలను ఓ మైనర్ బాలిక నడిపిస్తుండటం గమనార్హం. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్కుమార్ వివరాలను వెల్లడించారు. నగరంలోని పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలలో బైకులు చోరీ చేసి, వాటిని విక్రయించడం లేదా తాకట్టు పెట్టి వచ్చే డబ్బుతో నిందితులు జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పూతీ ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ళ దాలయ్య,, లంకపేట ప్రాంతానికి చెందిన విప్పర్తి రాజు, బీడీ కాలనీకి చెందిన దొంగ దుర్గా సాయిరాం, వంగాయిగూడెం నేరెళ్ల రాజు కాలనీకి చెందిన రూతు మణికంట, భీమడోలు మండలం గుండుగొలను, వడ్డీగూడెం గ్రామానికి చెన్నపాటి ఆంజనేయులు, అదే ప్రాంతానికి చెందిన శానాపతుల వీరవంశీలతో పాటు సూత్రధారిగా ఉన్న ఓ మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల రూపాయల విలువైన 21 ద్విచక్ర వాహనాలను (ఎక్కువగా సుజుకి యాక్సెస్ బైకులు) స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలికను బాలికల వసతిగృహానికి, మిగిలిన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ ఎస్సైలు రామకృష్ణ, మధు వెంకటరాజా, మహిళా ఎస్సై నాగ కళ్యాణి, హెడ్ కానిస్టేబుల్ కే రవిచంద్ర, కానిస్టేబుల్ విశాఖ రజినిలను ప్రత్యేకంగా అభినందించారు.


