● ఆర్మీ హవాల్దర్కు కన్నీటి వీడ్కోలు
● సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
భీమడోలు : దేశ రక్షణ కోసం భారత సైన్యంలో హవాల్దర్గా విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన భీమడోలులోని లోకంటి గోపాలకృష్ణ (41)కు శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 1న జమ్మూకాశ్శీర్లోని ఉదంపూర్లో తన విధులు ముగించుకున్న తర్వాత రాత్రి అకాల మరణం చెందారు. అక్కడ సైన్యం ఆసుపత్రిలో శవ పంచనామాను నిర్వహించి పార్ధివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అక్కడ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గన్నవరం వరకు విమానంలో తీసుకుని వచ్చి అంబులెన్స్లో భీమడోలు గ్రామానికి శుక్రవారం పంపారు. దీంతో భీమడోలు విషాదఛాయలు అలముకు న్నాయి. గ్రామ శివారు నుంచి గ్రామస్తులు భారీగా తరలివచ్చి ర్యాలీగా వీడ్కోలు పలికారు. గోపాల్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
సైనిక లాంఛనాలతో..
ఏలూరు 19 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీకి చెందిన జేసీవో సుబేదార్ వినోద్ ఆధ్వర్యంలో సైనిలాంఛనాలతో గౌరవ వందనం సమర్పించారు. గోపాలకృష్ణ పార్ధివదేహం వద్ద ఘన నివాళులర్పించారు. జాతీయ జెండాను కుటుంబ సభ్యులకు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్నేహితులు, బంధువులు, వివిధ సంస్థల ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పార్ధివదేహంపై పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
కుటుంబ సభ్యుల రోదనలు
గోపాలకృష్ణ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు తల్లి, భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల తండ్రి మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోపాలకృష్ణ అకాల మరణంతో కుటుంబం రోదనలు మిన్నంటాయి. దేశానికి సేవ చేయాలన్న తపనతో కొన్నేళ్ల కితం గోపాలకృష్ణ సైన్యంలో చేరారు. దేశ సేవలో ఆయన చేసిన సేవలను గ్రామస్తులు కొనియాడారు.


