భీమడోలు : భీమడోలులోని వడ్లపట్ల రోడ్డులోని కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన యంత్రాలు, సామగ్రి, ధాన్యం, బియ్యం నిల్వలు మంటలకు దగ్ధమ య్యాయి. రైస్మిల్లులోని ఎలిమినేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న భీమడోలు, ఏలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇటీవల భీమడోలుకు నూతనంగా మంజూరైన అగ్నిమాపక వాహనం కొంత సేపు మొరాయించడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. దీనితో స్థానిక ప్రాంత వా సులు భయాందోళనలు చెందారు. అనంతరం ఏలూరు నుంచి వాహనం రావడంతో మంటలు ఆర్పారు. భీమడోలు సీఐ వి.కృష్ణ, ఎస్సై ఎస్కే మదీనాబాషా సంఘటన స్థలానికి చేరకుని పరిస్థితిని పర్యవేక్షించి తమ సిబ్బందితో అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తూ సహాయ చర్యలు చేపట్టారు. అయితే రైస్మిల్లులోకి ప్రవేశించేందుకు అవకాశం లేకపోవడంతో కిటికీల నుంచి ఫైర్ గన్లతో నీటిని పంపి మంటలను ఆర్పేందుకు అవస్థలు పడ్డారు. అగ్నిమాపక అధికారి ఎస్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది రైస్ మిల్లులోని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు రాత్రి వరకు ప్రయత్నించారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని అగ్ని మాపక అధికారి ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


