పోలవరం రూరల్: ద్విచక్ర వాహనాల చోరీ కేసును పోలవరం పోలీసులు ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు అతని వద్ద నుంచి 6 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ తెలిపారు. బుధవారం పోలవరం పోలీస్ స్టేషన్లో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, సీఐ బి. కృష్ణకుమార్ పర్యవేక్షణలో పోలవరం ఎస్సై పి. అప్పారావు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 360 డిగ్రీల సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ద్వారా చోరీకి గురైన బైక్ కదలికలను గుర్తించి, ఏలూరు కంట్రోల్ రూమ్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో రేపల్లెవాడ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ తప్పించుకునేందుకు యత్నించిన కమ్మరగూడెం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్ అలియాస్ చింటు (19)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు పలు ప్రాంతాల్లో బైక్ల చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో, అతని నుంచి మొత్తం 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బైక్లలో పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 3, సీతానగరం పీఎస్ పరిధిలో 2, రాజమహేంద్రవరం త్రీటౌన్ పీఎస్ పరిధిలో 1 ద్విచక్ర వాహనం ఉన్నాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.
6 బైక్ల స్వాధీనం, నిందితుడి అరెస్ట్


