● ఏలూరు జిల్లాపై తీవ్ర ప్రభావం
● 47.3 శాతం వర్షపాత లోటు
● ఆక్వా, వ్యవసాయ రంగాలకు భారీ గండి
కై కలూరు: సూపర్ ఎల్నినో ప్రభావంతో ఏలూరు జిల్లా తీవ్ర భానుభగవానుడి ప్రతాపానికి, అనావృష్టికి గురవుతోంది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఆక్వా, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వేడిగాలులు తట్టుకోలేక గృహ వినియోగంలో ఏసీలు, కూలర్లు, మరోవైపు వ్యవసాయం, ఆక్వారంగాల్లో మోటార్ల వాడకం విపరీతంగా పెరిగింది. విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగడంతో పెరిగిన విద్యుత్ బిల్లుల కారణంగా పలు కుటుంబాలు ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడింది.
రుతుపవనాల కనుమరుగు : గతేడాది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచి సాధారణం కంటే 5.84 శాతం అధిక వర్షపాతం నమోదవ్వగా, ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ఆగస్టు చివరి నాటికి సాధారణ వర్షపాతం 567.1 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 298.8 మి.మీ మాత్రమే కురిసింది. అంటే ఏకంగా 47.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతింది. వర్షాలు లేక బోర్లపైన, మోటార్లపైన ఆధారపడటంతో డీజిల్, విద్యుత్ ఖర్చులు రైతులకు భారంగా మారాయి.
ఆక్వా రంగం కుదేలు
జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో చేపలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు కలిపి మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దీనిపై సుమారు 75,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఎల్నినో ధాటికి చెరువుల్లో నీరు వేడెక్కి రొయ్యలు మేత తినడం మానేశాయి. దీనికితోడు తెల్లమచ్చల వ్యాధి, విబ్రియో, వివిధ వైరస్ తెగుళ్లు విజృంభిస్తున్నాయి. మందుల ఖర్చులు, మేతల ధరలు అమాంతం పెరగడం, తీవ్ర నీటి కొరత వేధిస్తుండటంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్
డిస్కంల నివేదిక ప్రకారం తీవ్రమైన వేడిగాలుల వల్ల విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగింది. రంగాల వారీగా పరిశీలిస్తే ఆక్వారంగంలో 35 శాతం, వ్యవసాయ రంగం 30 శాతం, గృహ వినియోగం 25 శాతం, పరిశ్రమలు 10 శాతం మేర వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత భరించలేక గృహాల్లో ఏసీల వాడకం పెరగడంతో, మధ్యతరగతి కుటుంబాలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక అప్పులపాలవుతున్నాయి.
నెల సాధారణ 2025 2026
వర్షపాతం వర్షపాతం వర్షపాతం
జనవరి 0.2 0.0 0.0
ఫిబ్రవరి 0.2 0.1 0.0
మార్చి 0.5 1.2 0.3
ఏప్రిల్ 0.5 0.0 0.1
మే 1.7 3.5 0.8
జూన్ 112.5 124.0 106.26
జూలై 242.9 255.4 89.03
ఆగస్టు 246.5 210.2 56.64
సాగు చెరువుల్లో తక్కువ సంఖ్యలో చేప పిల్లలను వదలాలి. ఆక్వా సాగుపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతల మార్పుల వల్ల విబ్రియో, బ్యాక్టీరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందించేందుకు ఎరేటర్లను నిరంతరం వాడాలి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే పెద్ద చేపలు చనిపోయే ప్రమాదం ఉంది.
– ఎం.రవికుమార్, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కై కలూరు
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఎల్నినో ఏర్పడి వర్షాలు కురవడం లేదు. వరి సాగుకు నీటి కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఏవి వేయాలో రైతులకు వివరిస్తున్నాం. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకునేలా అవగాహన కలిగిస్తున్నాం.
– ఆర్.దివ్య, వ్యవసాయ అధికారి, కై కలూరు


