ఏలూరు (టూటౌన్): పీజీఆర్ఎస్ అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఇందులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో పిజీఆర్ఎస్, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ‘కౌశలం’ తదితర అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కార్యాలయానికి వచ్చే అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. కౌశలం కార్యక్రమం కింద జిల్లాలోని 2,303 మంది యువతకు శిక్షణ అందించామని, వారందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, డీఆర్ఓ ఎం.శ్రీదేవి, ఎస్డీసీ దేవకీదేవి పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ
జిల్లాలో 2,53,845 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కింద రూ.111.60 కోట్ల సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం స్థానిక ఆదివారపుపేట, రజకులపేట సచివాలయాల వద్ద ఆమె లబ్ధిదారులకు స్వయంగా పింఛను నగదును అందజేశారు.


