భీమడోలు: ఆరు దశాబ్దాలుగా సాగులో ఉన్న తమ జిరాయితీ భూములను రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చడాన్ని నిరసిస్తూ భీమడోలు మండలం అంబర్పేట రెవెన్యూ పరిధిలోని కురెళ్లగూడెం (కొల్లేరు) రైతులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్ 322 లోని సుమారు 55 ఎకరాల జిరాయితీ భూములను, అధికారుల అక్రమ సబ్–డివిజన్ల ద్వారా ప్రభుత్వ భూములుగా మార్చారని రైతులు ఆరోపించారు. బడా ఆక్వా రైతు ఎన్వీఆర్కే రాజుకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని, దీనివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చెందిన 6 ఎకరాల భూమిని బడా ఆక్వా రైతు ఎన్వీఆర్కే రాజు ఆక్రమించుకుంటున్నాడని, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదని రైతు అల్వా శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరితే రెవెన్యూ అధికారులు ఆ రైతుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆందోళనలో భాగంగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, అనంతరం డెప్యూటీ తహసిల్దార్ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై తహసీల్దార్ బి.రమాదేవి స్పందిస్తూ, రైతులకు అన్యాయం చేసే ఉద్దేశం లేదని, ఆరు దశాబ్దాల నాటి ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించి అర్హులైన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పి.రవికుమార్, ఈతకోట శ్యామల, మోపిదేవి వెంకట సత్యనారాయణ, ఈతకోట వెంకటేశ్వరరావు, మోపిదేవి కృష్ణ, వీరయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


