కొయ్యలగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు అడ్డాగా మారిందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు విమర్శించారు. గవరవరం సెంటర్లో మండల రైతు విభాగం అధ్యక్షుడు గంటా రమేష్, గ్రామాల కన్వీనర్లు పలివెల దుర్గారావు, అత్తిలి కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు ముబ్బషీర్లపై పొగాకు వ్యాపారి కడిమి సూరిబాబు పెట్టిన అక్రమ కేసుల వెనుక కూటమి కుట్ర ఉందని ఆరోపించారు. ముస్తఫా వద్ద రూ.35 లక్షల అడ్వాన్స్ తీసుకుని ఏడాది దాటినా పొగాకు ఇవ్వకుండా, వేరే కంపెనీలకు విక్రయించడాన్ని ప్రశ్నించినందుకే ఈ కక్ష సాధింపు అని మండిపడ్డారు. అరెస్టులో ఉన్న ముస్తఫాకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంఘీభావం తెలపడాన్ని విమర్శించే స్థాయి సూరిబాబుకు లేదన్నారు. సూరిబాబుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆయనను దూరంగా పెట్టామని వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ నూకల రాము స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పొగాకు వ్యాపారులు మాట్లాడుతూ తామంతా ముస్తఫా వద్ద అడ్వాన్సులు తీసుకున్నామని వ్యాపారాల్లో నష్టాలొచ్చినా ఆయన తమకు అండగా నిలిచారని తెలిపారు. సూరిబాబు అనేక చోట్ల అడ్వాన్సులు తీసుకుని ఎగవేస్తూ రాజకీయ వేధింపులకు పావుగా మారాడని ఆరోపించారు. ముస్తఫా కుటుంబానికి పూర్తి నైతిక మద్దతు ప్రకటిస్తూ, వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో పార్టీ వాణిజ్య విభాగం నేతలు సీమకుర్తి సత్యనారాయణ, బొమ్మా సత్యనారాయణ, సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గాప్రసాద్, మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ బాజీ, ఎంపీపీ గంజిమాల రామారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దూలపల్లి కాంతారావు, జిల్లా కార్యదర్శి చిడిపి రవి, మిరియాల వెంకటపతి, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


