5 నెలలైనా పట్టించుకోవడం లేదు
నిడమర్రు: కొల్లేరు అభయారణ్య పరిధిలోని నిషేధిత భూముల్లో ఆక్వా సాగు చేస్తున్నట్లు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు.. అధికారులు మాత్రం రాతపూర్వక సమాధానాలు మాత్రమే చెబుతున్నారు. ఆ భూముల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. దేవరగోపవరం గ్రామంలో 5వ కాంటూరు పరిధిలోని జీ రాయితీ భూముల్లో ఆక్వా సాగు నిషేధం కాగా, ఖండ్రిక పరిధిలోని సుమారు 75 ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు వివాదాస్పదంగా మారింది. ఈ ఆక్వా చెరువుల మధ్యలో ప్రభుత్వ భూమి ఉందని, సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానిక గ్రామస్థుడు తుమ్మూరి శ్రీను గత కొంత కాలంగా పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతవరకూ పూర్తి స్థాయిలో ఈ వివాదాస్పద చెరువుల భూములను సమగ్ర సర్వే నిర్వహించలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
ఆక్రమణలో ఖండ్రిక కోడు
కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోకి వచ్చే దేవర గోపవరం ఖండ్రిక కోడును ఆనుకుని గతంలో జీ రాయితీ పొలాలు ఉండేవి. కొల్లేరు ప్రక్షాళన అనంతరం ఆ భూములను ఆక్వా చెరువులుగా కొందరు పెద్దలు మార్చేశారు. ఈ క్రమంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఖండ్రిక కోడును ఆక్రమించుకుని ఆయా చెరువుల మధ్యలో కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని వల్లే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరులోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో, నీరు ఎగదన్ని ఎగువన ఉన్న వరి పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పలువురు రైతులు చెబుతున్నారు. ఖండ్రిక కోడును ప్రక్షాళన చేసి తిరిగి రికార్డుల ప్రకారం ఇరిగేషన్ డ్రైన్గా భౌతికంగా చూపించాలని కోరుతున్నారు.
సర్వేకు అనుకూలంగా లేదు
ఆర్డీవో స్పందిస్తూ.. ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉండి, ప్రస్తుతం 75 ఎకరాలతో కూడిన 6 చెరువుల మధ్యలో పూర్తిగా నీటితో నిండి ఉండటం వలన సర్వే నిర్వహించేందుకు వీలు పడదని మండల సర్వేయర్ చెప్పినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో ఇదే ఫిర్యాదును+ రీఓపెన్ చేసినప్పుడు మరోసారి సర్వే చేసేలా ఆర్డీవో చర్యలు తీసుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న అటవీశాఖ, రెవెన్యూ సిబ్బంది కలిసి సర్వే చేశారు. ఆ నివేదికలో ఖండ్రిక కాలువ సుమారు 1,127 మీటర్ల పొడవున విస్తరించి ఉన్నట్లు, నలుగురు ఆక్వా రైతులకు చెందిన చెరువుల గుండా వెళుతున్నట్లు నిర్ధారించారు. ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లు కొల్లేరు అభయారణ్య పరిధిలో కలిసి ఉన్నట్లు నివేదించారు. ఈ సర్వే చేయాలన్నా, ఆక్రమణలు తొలగించాలన్నా అటవీశాఖ అనుమతితో తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిని కలుపుకున్నారని
పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు
ఖండ్రిక కోడును కలిపేసుకుని చెరువులు తవ్వేశారని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నేను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాను. దీంతో 5 నెలల క్రితం సర్వే చేసేందుకు అధికారులు వచ్చి, ఖండ్రిక కోడు ఆక్రమణలో ఉందని నిర్ధారించారు. నేటి వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
– తుమ్మూరి శ్రీనివాసు, దేవరగోపవరం


