ఏలూరు (టూటౌన్): ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను అరికట్టాలని ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ విద్యా విభాగం సమావేశం నిర్వహించారు. సమావేశంలో పి.కిషోర్ మాట్లాడుతూ తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆశతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారని, దాన్ని అవకాశంగా మలుచుకొని కార్పొరేట్ విద్యాసంస్థలో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో దోచేస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు స్కూల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని, అది ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలలో సరిపడా స్కూలు గ్రౌండ్లు, లైబ్రరీ, కనీసం విద్యార్థులకు సైకిల్ స్టాండ్లు ఉండటం లేదని అన్నారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించని కార్పొరేట్ విద్యాసంస్థలు విపరీతంగా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


