ఏలూరు (ఆర్.ఆర్.పేట): ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఫ్యాప్టో చేపట్టిన పోరాటానికి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే రాష్ట్రవ్యాప్త భారీ నిరసన కార్యక్రమంలో తమ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, తలనీలాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజల ద్వారా రూ.84,970 ఆదాయం వచ్చిందని తెలిపారు.


