తణుకు అర్బన్: తణుకు గోస్తనీ కాలువలోకి దూకి గల్లంతైన బాలిక గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఉదయం స్థానిక సజ్జాపురం శివాలయం వంతెన పైనుంచి బాలిక దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి గోస్తనీ కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సమయంలో బాలిక దూకిన ప్రాంతానికి కొంత దూరంలోనే మృతదేహం లభ్యమైంది. లాస్య మృతదేహం ఎన్డీఎంసీ అనే పేరుతో ఉన్న ప్రైవేటు దంత వైద్యశాల యూనిఫామ్లో ఉంది. బాలిక కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్థానిక ప్రజలు ఘటనా ప్రాంతానికి భారీగా చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఏం జరిగిందో..
బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కాలువలోకి దూకే ముందు వంతెనపై కొంత సేపు టచ్ఛాడడం, ఈక్రమంలో స్థానికులు పలుకరించగా ఎటువంటి అనుమానం రాకుండా కాలువలో చేపలు చూస్తున్నానని సమాధానం చెప్పడం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి. రెండేళ్ల క్రితం తల్లి లక్ష్మి అదే వంతెన పైనుంచి గోస్తనీ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం, ఆ తరువాత తండ్రి సైతం కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో లాస్య మేనత్త సత్యవతి వద్ద ఉండగా ఆమె చెల్లెలు శ్రీహన్సిక నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటోంది. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. పట్టణ ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ పర్యవేక్షించారు.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు


