ఏలూరు (టూటౌన్): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని కరల్ర వంతెన సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను మాట్లాడుతూ తరగతుల కుదింపు రద్దు రేషనలైజేషన్ పేరుతో జిల్లెలగూడెం, ఇటుకలకోట, లంకపాకల, పులిరామన్న గూడెం ఆశ్రమ పాఠశాలల్లో తరగతులను కుదించడం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, 10–20 కి.మీ దూరంలోని పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు బడి మానేస్తున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాడైపోయిన తరగతి గదుల పైకప్పులను బాగు చేయాలని, స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడంతో పాటు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించాలన్నారు.


