భీమవరం అర్బన్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడు, ఆటో డ్రైవర్ శ్యాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు గురువారం వివరాలను వెల్లడించారు. తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంతవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొంతకాలంగా తల్లి అనారోగ్యంగా ఉండటంతో స్వగ్రామం తాడేరు వచ్చి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం చేస్తోంది. బేతపూడి గ్రామ శివారు కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్యాంబాబు అనంతవాణికి మాయమాటలతో దగ్గరయ్యాడు. అయితే శ్యాంబాబుకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో కొంతకాలంగా అతడిని దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అనంతవాణిపై కక్ష్య పెంచుకున్న శ్యాంబాబు ఈ నెల 5వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడి ఆమెను కత్తితో హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్యాంబాబుని యనమదుర్రు గ్రామంలోని వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హత్యకు వినియోగించిన కత్తి, ఆటో, ద్విచక్ర వాహనం, హత్య చేసిన సమయంలో ధరించిన దుస్తువులను స్వాఽధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, రూరల్ ఎస్సై ఐ వీర్రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


