ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న ఆర్ఐఓ యోహాన్ను తక్షణం సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీ శివకుమార్, జిల్లా కార్యదర్శి కే సిద్ధూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న ఆర్ఐవోను సస్పెండ్ చేయాలని కోరుతూ బుధవారం స్థానిక ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. చర్యలు తీసుకోవాల్సిన ఆర్ఐఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలపై సరైన పర్యవేక్షణ చేయడంలేదని ఆరోపించారు. పలుమార్లు ఆర్ఐఓకు వినతిపత్రాలు అందించినా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.
ఏలూరు (టూటౌన్): అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ జులై 10న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయు జిల్లా అధ్యక్షుడు పి.భారతి, కార్యదర్శి టి.మాణిక్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానని వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరుగుదలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు యాప్స్ పేరుతో అంగన్వాడీలపై తీవ్ర పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి బుధవారం శనివారపు పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో బాలురకు అందిస్తున్న వసతులు అడిగి తెలుసుకున్నారు, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అనంతరం విద్యానగర్ లోని ప్రభుత్వ శిశుగృహాన్ని సందర్శించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాల్లో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీల్లో ఉత్తమ నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్ శ్రీసహాన్ఙా ప్రథమ బహుమతి గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ నాటికగా యడ్లపాడు మానవతా సాగరి వారి ‘అందరూ మంచివారే కానీ!’, తృతీయ ఉత్తమ నాటికగా హైదరాబాద్ స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారి ‘సీ్త్ర మాత్రే నమః’ఎంపిక కాగా ప్రత్యేక జ్యూరీ బహుమతి చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి శ్రీమా ఇంట్లో మహాభారతం్ఙ గెలుచుకుంది. పోటీల్లో ఉత్తమ నటుడుగా సహానా నాటికలో వాసుదేవరావు పాత్ర పోషించిన ఎన్.రవీంద్ర రెడ్డి, ద్వితీయ ఉత్తమ నటుడుగా ఎస్.పవన్ కుమార్, ఉత్తమ ప్రతినాయకుడిగా లక్ష్మణ శాస్త్రి, ఉత్తమ సహాయ నటుడిగా తాళాబత్తుల వెంకటేశ్వర రావు బహుమతులు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా సహానా పాత్రధారి కుసుమ సాయి, ద్వితీయ ఉత్తమ నటిగా సురభి పూజిత బహుమతులు అందుకున్నారు.


