పోలవరం రూరల్: మండలంలోని కృష్ణారావుపేట సొసైటీలో రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలపై ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె.హబీబ్ బాషా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా రైతులకు అవసరమైన సమయంలో మూడు దఫాలుగా సరఫరా చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల రైతులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. యాప్ వినియోగానికి ఆధార్ తప్పనిసరని, శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే పంటల వారీగా ఎరువుల కోటా కేటాయిస్తారని, రైతులు కొనుగోలు చేసిన వివరాలు మొబైల్కు సందేశం ద్వారా అందుతాయని వివరించారు. అనంతరం రైతులు అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. పోలవరం మండలంలోని ముంపు ప్రాంతాల్లో గోదావరి వరదల వల్ల పంటలు పాడై, రెండు మూడు సార్లు నాట్లు వేయాల్సి వస్తోందని, ముంపు ప్రాంతాలకు ఎరువుల కోటాను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఎకరానికి ఇచ్చే రెండు బస్తాల యూరియాను మూడు బస్తాలకు పెంచాలని, డీఏపీ కూడా ఎకరానికి బస్తా కేటాయించాలని కోరారు. పొలాలకు రహదారులు లేనందున, రెండో పంటకు సంబంధించిన మూడు విడతల కోటాను ఒకేసారి ఇస్తే నిల్వ చేసుకునేందుకు వీలుంటుందని తెలిపారు.


