ఏలూరు టౌన్: ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శబ్ద కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదంతో చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు, మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరు ట్రాఫిక్ సీఐ ఎస్.లక్ష్మణరావు నేతృత్వంలో సిబ్బంది మంగళవారం నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన స్పీకర్లు, ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న ఎల్ఈడీ లైట్లు, రణగొణ ధ్వనులు చేసే 50 మోటారు సైకిళ్ల సైలెన్సర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, కై కలూరు రూరల్ సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


