ఏలూరు (టూటౌన్): కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు అర్జీలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి, అర్జీదారులు సంతప్తి చెందేలా పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పీజీఆర్ఎస్లో మొత్తం 365 అర్జీలను స్వీకరించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సీహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్చార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.
అర్జీలలో కొన్ని..
● గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ1.44 కోట్లకు పైగా ఎరువులు అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన సిరిమళ్ళ వెంకటేశ్వరరావు అర్జీ సమర్పించారు,
● పంట బొదేను పూడ్చివేశారని వారిపై చర్యలు తీసుకుని, పంట బొదేను తిరిగి ఏర్పాటు చెయ్యా లని ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన చల్లగుళ్ల నరేష్ కుమార్ కోరారు.
● రహదారిని ఆక్రమించుకున్నారని, తిరిగి రహదారిని ఏర్పాటు చేయాలని పెదపాడు మండలం వట్లూరుకు చెందిన షేక్ మహబూబ్ సుభానీ కోరారు.


