ఆగిరిపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు మండలంలోని కనసానపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి వెళ్లే రహదారిని ధ్వంసం చేయడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైతులు, గ్రామస్తులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల క్రితం కనసానపల్లి నుంచి గొల్లనపల్లి వెళ్లే రహదారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ జేసీబీతో భారీ గుంత తవ్వి రహదారిని ధ్వంసం చేశారని గ్రామస్తులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, నిత్యావసరాల కోసం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోడ్డును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు కారు సత్యనారాయణ, నల్లమోతు నరేష్, శోభన్బాబు సోమవారం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్న్లో ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశారు.
ఆగిరిపల్లి: ఈదులగూడెం వీఆర్ఏ రామిశెట్టి లక్ష్మణరావు గ్రామంలో అక్రమాలకు పాల్పడుతుండడంపై రైతు దండబోయిన వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. పెద్ద చెరువు భూమిలోని 50 సెంట్ల భూమిని వీఆర్ఏ లక్ష్మణరావు అక్రమంగా ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అంతేకాకుండా అతని అనుచరులను కూడా ప్రోత్సహించి చెరువు భూమిని ఆక్రమించుకునేలా చేస్తున్నాడని దీంతో పొలాల్లో రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతు వెంకటేశ్వరరావు తెలిపాడు. అంతేకాకుండా గ్రామంలోని సీతారామాంజనేయ స్వామికి చెందిన 1.06 ఎకరాల భూమిని వీఆర్ఏ అనుచరులు ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేశారని, దీంతో ఆలయానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


