ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)
2009, 2024 ఎన్నికల్లో భీమడోలులో శాసనసభ ఎన్నికల్లో నేను, నా భార్య ఓట్లు వేశా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేశా. సర్ కార్యక్రమంలో మా ఓట్లు గల్లంతులయ్యాయి. 2002లో నా ఓటు గుంటూరులో ఉండేది. భీమడోలులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ ఓట్లు తొలగించారు. మ్యాపింగ్లో ఆన్లైన్లో నా పేరు గుంటూరులో కనిపించడం లేదు. బీఎల్వో గుంటూరులోని ఎపిక్ కార్డు నెంబర్, తల్లిదండ్రులు వివరాలుంటే తీసుకుని రావాలని చెప్పారు. దీంతో గత్యంతరం లేక గుంటూరు వెళ్తున్నాను.
– కె.రామ్మోహనరావు, ఓటరు, భీమడోలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటు ఎన్యూమరేషన్ ఫారంలు ఇంకా అందలేదు.. ఏలూరు నగరంలో ప్రతి మూడు వీధుల్లో 10 నుంచి 15 ఇళ్లకు దరఖాస్తులు చేరలేదు. బీఎల్ఓలు సచివాలయాలకు వచ్చి తీసుకెళ్లండి అని కూడా చెప్పలేదు. ఎవరైనా సచివాలయంలో సంప్రదిస్తే రేపు వస్తుంది.. ఎల్లుండి వస్తుందని చెబుతున్నారు. కట్చేస్తే.. జిల్లాలో మాత్రం 99 శాతం దరఖాస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తయిపోయిందని జిల్లా యంత్రాంగం ప్రకటించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇచ్చింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నిర్వహిస్తుంది.
మొదటిగా జిల్లాలోని 16,44,193 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారంలు అందచేయాలి. ప్రతి నియోజకవర్గానికి పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి బూత్ లెవల్ ఆఫీసర్లను కలెక్టర్ నియమించారు. ఏలూరులో 213 మంది, దెందులూరులో 239, చింతలపూడిలో 273, నూజివీడులో 286, కై కలూరు 235, పోలవరంలో 284, ఉంగుటూరులో 214 మంది కలిపి 7 నియోజకవర్గాల్లో 1,744 మంది బీఎల్ఓలను నియమించి వారి పరిధిలో ప్రాంతాల వారీగా సచివాలయ సిబ్బందితో ఎన్యూమరేషన్ ఫారంలు ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉంది. అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. అధికారిక యంత్రాంగం మాత్రం అన్ని పూర్తి చేశామని గత మూడు రోజుల నుంచి ప్రకటిస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో 100 శాతం ఫారంలు పంపిణీ చేసినట్లు, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 99 శాతం, ఏలూరు నగరంలో 98.13 శాతం పూర్తి చేసినట్లు ప్రకటించారు. మరోవైపు సర్పై అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం, కార్యక్రమ ప్రధాన ఉద్దేశం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా ఎలా చేసుకోవాలనే వివరాలను అధికారికంగా చెప్పకపోవడం ఇలా అనేక సమస్యలతో సర్ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతుంది. ఇంకోవైపు పంపిణీ పూర్తి కాకుండానే జిల్లాలో 58.48 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు ప్రకటించారు. అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 62.07 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు చెబుతున్నారు.
58.48 శాతం డిజిటలైజేషన్ పూర్తి
ఇక దరఖాస్తులు పూర్తిగా అందకుండానే 58.48 శాతం డిజిటలైజేషన్ చేసి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని ప్రకటించారు. దెందులూరు నియోజకవర్గంలో 50.54 శాతం, చింతలపూడిలో 52.72 శాతం, కై కలూరులో 51.39 శాతం, నూజివీడులో 58.03 శాతం, పోలవరంలో 61.06 శాతం, ఉంగుటూరులో 62.07 శాతం, ఏలూరులో 67.42 శాతం పూర్తయినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది.
జిల్లాలో 16.38 లక్షల ఫారంలు పంపిణీ పూర్తయిందని ప్రకటన
ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అందని వైనం
జిల్లా వ్యాప్తంగా 99.63 శాతం ఫారాలు పంపిణీ చేశామన్న అధికారులు
సర్పై అవగాహన లేమితో గందరగోళం
మా ఓటు హక్కును కాపాడండి
నా పేరు జాబితాలో ఉందా?
మాకు పత్రాలు
అందలేదు
ఫారాలు
ఎప్పుడిస్తారు


