
రైతులకు తీరని అన్యాయం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, వేరుశనగ, మొక్కజొన్న పంటలను మండల పార్టీ నాయకులతో కలిసి పరీశీలించారు. పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో వేరుశనగ పంటను రూ.9,200కు కొనుగోలు చేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.6,500 ధరతో కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పొగాకు రైతులకు కూడా గిటుబాటు ధర లభించక కష్టాల ఊబిలో కూరుకు పోయే పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పండించిన రైతులకు ఆ పంటను విక్రయించేందుకు తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రైతు భరోసా సొమ్ములు చెల్లించకపోవడం వల్ల పెట్టుబడి కోసం అప్పుల పాలయ్యారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, నాయకులు ఉప్పల రాంపండు, ములకాల బాబు, తట్టుకొల్ల అంజి తదితరులు పాల్గొన్నారు.