రామచంద్రపురం రూరల్: మండలంలోని జగన్నాయకులపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంటూరు శివారు చొల్లంగిపేటకు చెందిన చొల్లంగి అనంతలక్ష్మి (55) మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చొల్లంగిపేటకు చెందిన చొల్లంగి సత్యనారాయణ, భార్యతో అనంతలక్ష్మి తో కలసి రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. రాత్రి తిరిగి ఇంటికి వెళుతుండగా జగన్నాయకులపాలెం గ్రామంలో బొలెరో వాహనం వీరిని ఢీకొంది. దీంతో కిందపోయిన అనంతలక్ష్మి పైనుంచి వాహనం వెళ్లిపోయింది. సత్యనారాయణ కుడి భుజానికి గాయమైంది. అనంతలక్ష్మిని స్థానికులు 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి సమాచారం, మృతురాలి కుమారుడు చొల్లంగి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
కాట్రేనికోన: కుండలేశ్వరంలోని పుష్కరాల రేవు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నాగవరపు సుధీర్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, ఇన్చార్జి ఎస్సై బి.శివకృష్ణ, కాట్రేనికోన తహసీల్దార్ రవికిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని అమలాపురం కరక్కాయపేటకు చెందిన ఆ యువకుడిని పట్టుకున్నారు. రెండు కేజీలు గంజాయిని తీసుకువచ్చి, దానిలో కొంత అమ్మినట్లు సుధీర్ అంగీకరించాడు. మిగిలిన 1.58 కేజీల గంజాయిని, మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


