తగరపువలస (విశాఖ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. భీమిలి పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన కంఠమణి తరుణ్కుమార్ (19) సంగివలసలోని అనిట్స్ కళాశాలలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత శనివారం పార్ట్టైమ్ ఉద్యోగం ముగించుకుని బైక్పై తగరపువలస వైపు బయలుదేరగా.. రాత్రి 9 గంటల సమయంలో తాళ్లవలస సర్వీస్ రోడ్డులో ఎదురుగా కారులో వస్తున్న సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యుడు వెంకటేష్ కారు ఢీకొట్టింది. దీంతో తరుణ్కుమార్ తలకు, ఎడమ కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయిన అతడిని స్నేహితులు సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మరణించాడు. మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


