● రేపటి నుంచి ప్రారంభం
● జిల్లాలో 138 కేంద్రాలు
● డీఈవో వాసుదేవరావు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈవో కె.వాసుదేవరావు అన్నారు. ఎస్కేవీటీ హైస్కూల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 138 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 12,568 మంది బాలురు, 11,998 మంది బాలికలు మొత్తం 24.566 మంది రాయనున్నారని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. తనిఖీల కోసం ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 18 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. ప్రశ్నపత్రాలను జిల్లాలోని 22 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని, ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ల నుంచి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్ల ద్వారా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపే ఏర్పాటు చేశామన్నారు.
డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి హాజరై, చక్కగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


