నిడదవోలు: ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను పంచాయతీలో తాను లేకుండా పంచాయతీ సాధారణ సమావేశాన్ని నిర్వహించడాన్ని నిరసిస్తూ సర్పంచ్ గురజర్ల వీర వెంకట సత్యనారాయణ శనివారం నిరసన దీక్ష చేపట్టారు. తనకు సమాచారం ఇవ్వకుండా, టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం పాలకవర్గం సమావేశం నిర్వహించడాన్ని ఆయన ఖండించారు. కార్యదర్శి ఎలగన రమేష్, మండల అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పకపోవడంతో దీక్షకు కూర్చున్నట్లు చెప్పారు. అయితే రెండు గంటల పాటు టెంట్లో కూర్చుని నిరసన వ్యక్తం చేసిన ఆయన.. సహచరుల సూచనల మేరకు దీక్షను విరమించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ప్రథమ చికిత్సపై
పీఎంపీలకు శిక్షణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ గోగినేని తరుణ్ ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో శనివారం గ్రామీణ వైద్యులకు (పీఎంపీ) ప్రథమ చికిత్సపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ కామిరెడ్డి వెంకట రమణ, జిల్లా కోశాధికారి డాక్టర్ జి.మహాలక్ష్మి మాట్లాడుతూ ఎవరికై నా ఏదైనా అపాయం జరిగినప్పుడు నిపుణుల వైద్యం అందేవరకూ తాత్కాలికంగా చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ అవసరమవుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు, పీఎంపీ జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, ఎస్కే రహమాన్ షరీఫ్, ఆర్.సూర్యనారాయణ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ సత్యనారాయణ (చంటి), డీఎఫ్ఒ గోపీకృష్ణ, పద్మ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితుడికి
రూ.75 లక్షల భారీ పరిహారం
గొల్లప్రోలు (పిఠాపురం): రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ బాధితుడికి న్యాయస్థానం ద్వారా భారీ ఊరట లభించింది. గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరానికి చెందిన పాలపర్తి సుబ్బారావు తండ్రి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై బీమా పరిహారం కోరుతూ బాధితుడు పిఠాపురం కోర్టులో దావా వేశారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ఈ కేసుపై రాజీ కుదిరింది. జడ్జి ఎం.శ్రీహరి సమక్షంలో బాధితుడు సుబ్బారావుకు రూ.75 లక్షల విలువైన బీమా చెక్కును అందజేశారు.


