అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు పుల్లా సాయి అమృత, పుల్లా సాయి దీపక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు వివరాలను కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా శివపురానికి చెందిన విద్యారంభ గురుకుల్ నిర్వాహకులు శ్రీమంజునాథ పూజార్ వెల్లడించారు. తాము నిర్వహించిన ఆన్లైన్ శిక్షణలో కళ్లకు గంతలతో వివిధ పనులు చేయడంలో వీరు శిక్షణ పొందారన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని పుల్లా సాయిదీపక్ జంగా బ్లాక్స్తో టాలెస్ట్ టవర్ రూపొందించాడన్నారు. సాయి అమృత స్మాల్ కళ్లకు గంతలతోనే 5.10 అడుగుల పేపర్ కప్పుల పిరమిడ్ రూపొందించిందన్నారు. ఈ కేటగిరీలో వీరిదే అత్యుత్తమ ప్రదర్శన కావడంతో ఇంటర్నేషనల్ బుక్ఆఫ్ రికార్డ్స్లో వీరి పేర్లు నమోదు చేశారన్నారు. ఈ మేరకు సంబంధిత సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్లను, పతకాలను సాయి దీపక్, సాయిఅమృతలకు శ్రీమంజునాథ పూజార్ అందజేశారు.
స్క్రబ్ టైఫస్పై
ఆందోళన వద్దు
రాజమహేంద్రవరం రూరల్: స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన చికిత్స అందుబాటులో ఉందని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ వ్యాధి సుత్సుగాముషి అనే కీటకం కుడితే సోకుతుందని, కుట్టిన ప్రదేశంలో ఎర్రటి మచ్చ కనిపిస్తుందన్నారు. పొలాలు, తోటలు, గుబురు చెట్లు ఉన్న ప్రదేశాలకు వెళ్లే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. పొడవు చేతులు గల షర్టులు, ప్యాంట్లు వేసుకోవడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా కీటకం కుడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచించారు. జ్వరం, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలన్నారు.
వెండి పుష్పమాల సమర్పణ
రాజోలు: కడలి గ్రామంలో కొలువైన చెన్నకేశవస్వామికి ఆ గ్రామానికి చెందిన కాశీభట్ల లక్ష్మీకన్యాకుమారి రూ.38 వేలు విలువ చేసే 200 గ్రాముల వెండి పుష్పమాలను బుధవారం సమర్పించారు. దీన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.నాగవిష్ణుకు అందజేశారు. కడలి గ్రామానికి చెందిన కాశీభట్ల రామశాస్త్రి సతీమణి లక్ష్మీ కన్యాకుమారి ఆ గ్రామ బ్రాహ్మణ ఆడపడుచుల తరఫున వెండి పుష్పమాల సమర్పించారని ఈఓ తెలిపారు.
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
శంఖవరం: ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నెల్లిపూడికి చెందిన సైపిరెడ్డి సత్తిబాబుకు చెందిన ట్రాక్టర్ జి.కొత్తపల్లి నుంచి నెల్లిపూడి కర్రల లోడు తీసుకువస్తోంది. ఆ సమయంలో శంఖవరం నుంచి జి.కొత్తపల్లి వస్తున్న ఆటోను అర్జున్ బొమ్మ సమీపంలో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అచ్చంపేటకు చెందిన బొట్టా నాగయమ్మ, బొట్టా భవానికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు
అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు
అక్కాతమ్ముళ్లు.. ప్రతిభలో ఘనులు


