ఆటపాట్లు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై నిర్లక్ష్యపు నీడలు అలముకున్నాయి. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా.. నిధుల విడుదల విషయంలో వెనుకాడుతోంది. ముఖ్యంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. అండర్ 14, 17, 19 తదితర అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
క్రీడాకారుల ఇబ్బందులు
ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో రూ.7 కోట్ల బడ్జెట్ కేటాయించినా, దాని నుంచి నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ, అలాగే వివిధ రాష్ట్ర, జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపేందుకు నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ – 19 విభాగంలో క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపించడానికి రవాణా ఖర్చులుగా రూ.8 లక్షలు మాత్రమే కేటాయించారు. వీటితోనే వారికి క్రీడా దుస్తులు, రవాణా ఖర్చులు అందించాలి. అండర్ – 19లో దాదాపు 100 జట్లను బాలురు, బాలికల విభాగంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం అండర్–19 కార్యదర్శి మారడంతో పాత అకౌంట్లోనే ప్రభుత్వం కేటాయించిన డబ్బులు జమ అయ్యింది. ప్రస్తుతం క్రీడాకారులు తమ సొంత ఖర్చుతోనే పోటీలకు హాజరవుతున్నారు.
సొంత ఖర్చులతో..
ఈ ఏడాది జిల్లాలో అండర్ – 19 విభాగంలో జిమ్నాస్టిక్స్, రోలర్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. వీటితో పాటు దాదాపు 48 క్రీడాంశాల్లో బాలురు, బాలికల జట్లను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న క్రీడాకారులు ఎక్కువ మంది ఈ విభాగంలో ఎంపికయ్యారు. వారందరూ సొంత ఖర్చులతో పోటీలకు హాజరయ్యేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనియర్ కళాశాలల నుంచి ఎంపికై న క్రీడాకారులకు కళాశాల స్పెషల్ ఫీజు నుంచి రవాణా ఖర్చులు అందించాలని ఆదేశాలు ఉన్నా.. చాలా కళాశాలల్లో నిధులు అందించడం లేదనే వాదన వినిపిస్తోంది.
అండర్ 14, 17 విభాగాల్లో...
ఈ ఏడాది అండర్ 14, 17 విభాగాల్లో జిల్లాలో స్వ్కాష్, జుడో, జిమ్నాస్టిక్స్, ఖోఖో, రోలర్ స్కేటింగ్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కాకినాడ జిల్లాకు రూ.8 లక్షలు మాత్రమే అడ్వాన్సుగా చెల్లించారు. వీటిని సుమారు 200 (అండర్ 14, 17 బాలురు, బాలికల విభాగాలు) మంది క్రీడాకారులను (జిల్లా జట్లు) రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు, క్రీడా దుస్తులు, బూట్లు, ట్రాక్ షూట్ అందించేందుకు వినియోగించారు.
ఎస్జీఎఫ్ఐ పోటీల నిర్వహణకు
అరకొర నిధులు
నిర్వాహకుల అవస్థలు
సొంత ఖర్చులతో క్రీడాకారుల పయనం
దాతల సాయంతో భోజనాలు
చంద్రబాబు పాలనలో క్రీడలకు దుస్థితి
టికెట్లు చూపిస్తే డబ్బులు ఇస్తాం
ఈ ఏడాది అండర్ 19 క్రీడాకారుల ఎంపికలను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఎంపికై న క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందిస్తున్నాం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల కోసం రూ.8 లక్షలు కేటాయించారు. కానీ అవి పాత అకౌంట్లో ఉండిపోవడంతో క్రీడాకారులు సొంత ఖర్చులతో పోటీలకు హాజరవుతున్నారు. వారు తమ ప్రయాణ టిక్కెట్లను తీసుకువచ్చి చూపిస్తే, వారికి డబ్బులు చెల్లిస్తాం.
– వెంకటరెడ్డి, అండర్–19 కార్యదర్శి
నిధులు కేటాయిస్తే మంచిది
వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర శాఖ నిధులు కేటాయించాలి. దాని వల్ల నిర్వాహకులకు భారం లేకుండా ఉంటుంది. కనీసం టోర్నమెంట్కు అయ్యే ఖర్చులో 50 శాతం నిధులు అయినా ముందుగా చెల్లిస్తే మంచిది.
– శ్రీనివాస్, ఎస్జీఎఫ్ఐ అండర్ 14, 17 కార్యదర్శి, కాకినాడ జిల్లా
ఆటపాట్లు
ఆటపాట్లు


