తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభించామని వైస్ చాన్సలర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు సోమవారం తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయంలో మొదటి బ్యాచ్ విద్యార్థులుగా చేరిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని చరిత్ర – సంస్కృతి, పురావస్తు శాస్త్ర పీఠం పీఠాధిపతి డాక్టర్ మునుగు శ్రీనివాసరావు, కూచిపూడిలోని సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేతం వైస్ ప్రిన్సిపాల్ చింతా రవిబాలకృష్ణ, సాహిత్య పీఠం ఇన్చార్జి పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, విద్యార్థులతో వీసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తామని చెప్పారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకొని, భావి జీవితం సుఖవంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, కేంద్ర సంగీత, నాటక అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కూచిపూడి నాట్య సంప్రదాయం ప్రకారం ‘అంబాపరాకు’ స్తుతిని అభినయించారు. అధ్యాపకులు డాక్టర్ వెంకట రామకృష్ణ, విశ్వ విద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


