ముందుగానే గుర్తిస్తే హెచ్ఐవీ నివారణ సాధ్యం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ముందుగానే గుర్తిస్తే హెచ్ఐవీ నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా స్థానిక వై.జంక్షన్ నుంచి ప్రభుత్వ అటానమస్ కళాశాల వరకూ సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి ప్రారంభించి, రెడ్ బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవీ పరీక్షలు గణనీయంగా పెంచామని, తొలి దశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టడం పూర్తిగా సాధ్యమవుతుందని చెప్పారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెచ్ఐవీ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణుల నుంచి శిశువులకు వ్యాధి సోకకుండా నిరోధించడంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. పాజిటివ్ శిశువుల కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలకి్ష్మ్ మాట్లాడుతూ, పిల్లల్లో నేర ప్రవృత్తిని ముందుగానే గుర్తించి, సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. జువైనల్ హోమ్స్లో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉండటం ఆందోళనకరమని అన్నారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ వంటి ముఖ్య విషయాలు తెలియజేయడం ద్వారా పిల్లలను రక్షించగలమని అన్నారు. పిల్లల ముందు గొడవలు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, అలాంటి వాతావరణం పిల్లల మనస్సుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ అధికారి ఎన్.వసుంధర, ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


