దోసకాయలపల్లిలో వ్యక్తి దారుణ హత్య
కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లి పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని సమీప బంధువే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీఐ సత్యకిషోర్ కథనం ప్రకారం.. నరేంద్రపురానికి చెందిన పిల్లి ఆనంద్ (30) దోసకాయలపల్లిలో స్థిరపడ్డాడు. మేకలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఆనంద్ భార్యతో అతని సమీప బంధువు, బొబ్బిల్లంకు చెందిన రాజ్కమల్ అసభ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహించిన ఆనంద్ వెంటనే రాజ్కమల్పై మండిపడ్డాడు. దీంతో రాజ్కమల్ కక్ష పెంచుకున్నాడు. ఏదోలా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం ఉదయం దోసకాయలపల్లిలోని పంచాయతీ కార్యాలయ సమీప ప్రాంతంలో మేకలను మేపుతున్న ఆనంద్ దగ్గరకు వెళ్లి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా అదనపు ఎస్పీ సుబ్బరాజు, నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ సిఐ సత్యకిషోర్ పరిశీలించారు. ఫోరెన్సిక్ టీమ్, జిల్లాకు చెందిన క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. హత్యకు సంభందించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


