థీమ్ సాంగ్ ఆవిష్కరణ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోని ఎస్కేవీటీ డిగ్రీ కళాశాలలో 3వ గోదావరి బాలోత్సవం శనివారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాన్ని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం బాలోత్సవ పతాకాన్ని గోదావరి బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు, ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు ఎస్వీవీ కృష్ణకుమార్ ఆవిష్కరించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పిల్లల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు బాలోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థులు మంచి మార్గంలో పయనిస్తున్నారా? పెడతోవలో నడుస్తున్నారా అనే ఆందోళన తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయుల్లోనూ ఉందన్నారు. ఈ తరుణంలో పిల్లలు చిన్ననాటి నుంచే కళలు, సాంస్కృతిక కార్యకలాపాలపై మక్కువ చూపేలా శ్రద్ధ చూపాలన్నారు. ఎంఎల్సి బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సమాజ మార్పునకు అవసరమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు, విద్యావేత్తలు, పాలకులు ఆలోచించాలన్నారు. నున్న తిరుమలరావు మాట్లాడుతూ బహుమతుల కోసం కాకుండా తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చేందుకు బాలోత్సవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ విద్యార్థులను బట్టీ చదువులకే పరిమితం చేస్తోందని సీసీసీ ఎండీ పంతం కొండలరావు అన్నారు. నాట్యాచారి సప్పా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు బట్టీ చదువులతోనే ఉంటే సృజనాత్మకత ఎప్పుడు వెలుగులోకి వస్తుందని ప్రశ్నించారు. గోదావరి బాలోత్సవ లక్ష్యాలను ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.తులసి వివరించారు. గోదావరి బాలోత్సవం థీమ్ సాంగ్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. విద్యార్థులకు నృత్యాలు, నాటికలు, జానపద గీతాలతో పాటు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖా అధికారి కె.వాసుదేవరావు, ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాడ్యం, ఎల్ఐసీ సీనియర్ మేనేజర్ సత్యనారాయణ సాహూ, అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి.క్రాంతికుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజర్లు నవీణకుమారి, కోలా సత్యనారాయణ, పువ్వుల ఆనంద్ పాల్గొన్నారు.
బాలోత్సవం ఆరంభం
బాలోత్సవం ఆరంభం
బాలోత్సవం ఆరంభం
బాలోత్సవం ఆరంభం
బాలోత్సవం ఆరంభం
బాలోత్సవం ఆరంభం


