● కార్డు లేదంటారు.. కనికరించరు
ఈ వృద్ధుడి పేరు పిల్లకత్తుల సుబ్బారావు. వయసు 84 సంవత్సరాలు. ఊరు నల్లజర్ల మండలం ముసుళ్ళుగుంట. ఒకప్పుడు పదెకరాల రైతు. ఆస్తి పిల్లలకు పంచగా ఆయన దగ్గర ఇప్పుడున్నది కేవలం 97 సెంట్ల భూమి. మూడేళ్ల క్రితం భార్య మరణించింది. పిల్లలు ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. సుబ్బారావు ప్రస్తుతం ఒంటరి వృద్ధుడు. ఐదు నెలల క్రితం ఆయన రేషన్ కార్డును ఏలినవారు రద్దు చేశారు. దీంతో, బియ్యం, ఇతర నిత్యావసర సరకులు అందక ఆయన నానా ఇక్కట్లూ పడుతున్నారు. తన పేరిట ఉన్న భూమికి కనీసం అన్నదాత సుఖీభవ సాయం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు. రేషన్ కార్డు కోసం రెవెన్యూ కార్యాలయానికి ఇప్పటికి సుమారు ఇరవైసార్లు వెళ్లారు. అయినా సరైన సమాధానం లేదు. సమస్య పరిష్కరించుకునేందుకు నానా అగచాట్లూ పడి రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తన రేషన్ కార్డు కొనసాగుతోందని అక్కడి వారు చెప్పారు. తీరా సొంతూరు వచ్చి చూస్తే కార్డు రద్దయిపోయింది పొమ్మంటున్నారు. ఏం చేయాలో తెలీక సుబ్బారావు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రెవెన్యూ కార్యాలయానికి గురువారం వెళ్లి అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పారు. వృద్ధాప్యంలో తనను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లజర్ల సెంటర్లో నిరాహార దీక్ష చేస్తేనైనా అధికారులు స్పందిస్తారేమోనని
ఆవేదనతో అన్నారు. – నల్లజర్ల


