‘నా మనవడు తీసుకువెళతాడు’
● రాజానగరం సాయిబాబా
గుడిలో వృద్ధురాలి ఎదురుచూపులు
● ఎవ్వరూ రాకపోవడంతో
ఓల్డేజీ హోమ్కు తరలింపు
రాజానగరం: ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు తీసుకువచ్చారో తెలియదు గానీ సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు రాజానగరంలోని సాయిబాబా గుడి వద్ద గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన వారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తన మనవడు వస్తాడని, తనను తీసుకువెళతాడంటూ ఆమె అమాయకంగా చెప్పడం స్థానికులను కలచివేసింది. తన పేరు ఆళ్ల వెంకాయమ్మ అని చెప్పింది. ఊరు పేరు అడిగితే ఒకసారి కట్టమూరు, మరోసారి వడ్లమూరు అని బదులిచ్చింది. అలాగే రాజమహేంద్రవరం నుంచి వచ్చానని కూడా పొంతన లేని విధంగా చెబుతూ వచ్చింది. వయోభారం వలన జ్ఞాపక శక్తి మందగించినట్టుగా ఉన్న ఆమె.. ‘నా మనవడు సత్తిబాబు వస్తాడు, నన్ను తీసుకువెళతాడు’ అని అంటూనే ఎదురు చూసింది. కానీ సాయంత్రం అయినా ఆమె కోసం ఎవరూ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో సమీపంలోని ఒక ఓల్డేజ్ హోమ్లో ఆమెను చేర్పించారు.


