అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ దేశానికి వెళ్లి, అక్కడ ఐడీ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే.. ముమ్మిడివరం మండలానికి చెందిన తెడ్లపు మల్లమ్మ, తాతారావు భార్యభర్తలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మల్లమ్మ.. ఏజెంట్ ద్వారా 2025 ఫిబ్రవరిలో మస్కట్కు వెళ్లింది. అక్కడ మూడు నెలలు పని చేసినా ఆమెకు ఆ దేశ ఐడీ కార్డు ఇవ్వకపోవడంతో ఇంటి యజమాని మల్లమ్మను మస్కట్లోని హవాలా ఆఫీస్ వద్ద వదిలి వెళ్లిపోయాడు. అక్కడి ఆఫీస్ వారు రూ.2 లక్షలు చెల్లిస్తే గానీ ఇంటికి పంపబోమని స్పష్టం చేశారు. మల్లమ్మ కుటుంబం కొంత మొత్తం చెల్లించినప్పటికీ పూర్తి మొత్తం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో పరిచయస్తుల సూచన మేరకు తాతారావు అమలాపురం కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను ఆశ్రయించారు. కలెక్టర్ మహేష్ కుమార్ తక్షణ చర్యలు తీసుకుని ఆమెను సురక్షితంగా ఇండియా చేర్చాలని కేసీఎంను ఆదేశించారు. మస్కట్ తెలుగు అసోసియేషన్ సభ్యురాలు ఇంటి రాజ్యలక్షి, ఏజెంట్తో కేసీఎం బృందం సంప్రదింపులు జరిపింది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి మల్లమ్మను విజయవంతంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు కేంద్రం నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ తెలిపారు.
కేసీఎం చొరవతో క్షేమంగా చేరిన మల్లమ్మ


