వీడని కాట్రగడ్డ హత్య కేసు మిస్టరీ
నల్లజర్ల: మండలంలోని పుల్లలపాడు గ్రామానికి చెందిన రైతు, డ్యాక్యుమెంట్ రైటర్ కాట్రగడ్డ ప్రభాకరావు (64) హత్య కేసు మిస్టరీ నేటికీ వీడలేదు. ఆయనను 2023 నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటలు దాటాక ఇంటి వద్దే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పిస్టల్తో కాల్చి చంపారు. రెండు బుల్లెట్లు చాతీలో దిగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అప్పటి డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను నియమించారు. కానీ ఇంత వరకూ ఆ కేసు మిస్టరీ వీడలేదు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గన్ కల్చర్ పల్లె ప్రాంతాలకు విస్తరించిందనటానికి పుల్లలపాడు సంఘటనే అద్దం పడుతోంది. కాట్రగడ్డ స్వతహాగానే 20 ఎకరాల భూస్వామి. అలాగే డాక్యుమెంట్లు రాయడమే కాకుండా పరిసర గ్రామాల వారి డాక్యుమెంట్లు రాసేవారు. సమాచార హక్కు చట్టమంటూ రెవెన్యూ అధికారులను పలుమార్లు లోకాయుక్తకు పిలిపించేవారు. ఇలా చాలామందితో ఆయనకు తగాదాలు ఉన్నాయి. ఆయన హత్య జరిగి రెండేళ్లు గడిచినా ఈ కేసు విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీనిపై నల్లజర్ల సీఐ రాంబాబును వివరణ కోరగా ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోందన్నారు.


