అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం
బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోను, ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించారు. శ్రీ కుమార సుబ్రహ్మణేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు ఉన్నత పాఠశాల ఆవరణ, మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, షష్ఠి ఉత్సవాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పాటించి, సంయమనంతో దర్శనం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలతో పాటు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలిపారు. బాణసంచా కాల్పుల సమయంలో తగిన జాగత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం, ఎస్పీ బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ అనసూరి శ్రీనివాస్, అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ యోగా
పోటీలకు భవానీ చౌదరి
దేవరపల్లి: చిన్నాయగూడేనికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి ఇమ్మణ్ణి అర్మిత భవానీ చౌదరి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జి.పంగులూరు మండలం చందలూరులో ఈ నెల 24న జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 ట్రెడిషనల్ యోగా బాలికల విభాగంలో ప్రథమ స్థానం సాధించి త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2023–24లో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ 2023లో అసోంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ, 2023 డిసెంబరులో ఉత్తర ప్రదేశ్ హజియాబాద్లో జరిగిన జాతీయ స్థాయి యూవైఎస్ఎఫ్ ప్రపంచ యోగా పోటీల్లో ద్వితీయ స్థానాలు సాధించానని వివరించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 2024లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపానన్నారు. ఈ ఏడాది జనవరిలో సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ఐదో స్థానం సాధించినట్టు చెప్పారు. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణపతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించడమే ప్రధాన ధ్యేయమన్నారు.
వారాహి అమ్మవారికి
ఆభరణాల సమర్పణ
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాత అమ్మవారికి పలువురు భక్తులు, దాతలు మంగళవారం వివిధ ఆభరణాలు సమర్పించారు. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి రూ.25 వేల విలువైను వెండి రుద్రాక్ష మాల, మేడపాటి శ్రీకాంత్రెడ్డి అమ్మవారి ఉత్సవమూర్తికి రూ.20 వేల విలువైన వెండి కిరీటం, నల్లమిల్లి గణేష్రెడ్డి రూ.75 వేలు విలువైన హస్తాలు, చైతన్య బ్యాంకర్స్ సౌజన్యంతో అమ్మవారి ముఖ అలంకారాలు, వానపల్లి వెంకట గణేష్ బంగారం, వెండితో తయారు చేయించిన మంగళ సూత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ, భక్తులకు ప్రతి రోజూ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ వారాహి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, సబ్బెళ్ల మోహన్రెడ్డి, పప్పు రామకృష్ణారెడ్డి, భాస్కర్స్వామి, అశోక్ స్వామి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం


