ధాన్యం చెల్లింపుల్లో జాప్యానికి అధికారులదే బాధ్యత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, జాప్యం జరిగితే అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతుల పంట రోడ్లపై ఎక్కడ నిల్వగా కనిపించినా అధికారులు వెంటనే స్పందించి, సమస్య పరిష్కరించాలని అన్నారు. రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను కొంత మంది దళారులు మభ్యపెట్టి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, తేమ శాతం, దళారీ వ్యవహారాలు, మిల్లర్ల కొనుగోలు పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బి.గణేష్ కుమార్, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ, రవాణా, సహకార, మార్కెటింగ్ అధికారులు వి.పార్వతి, ఎస్.మాధవరావు, ఆర్.సురేష్, ఎం.వెంకట రమణ, ఎం.సునీల్ వినయ్ పాల్గొన్నారు.


