కొండలు కరిగించేస్తున్నారు
లేబర్ కోడ్ల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
● నల్గొండలో విచ్చలవిడిగా
ఎర్రమట్టి తవ్వకాలు
● రేయింబవళ్లు యథేచ్ఛగా తరలింపు
● రోజుకు సుమారు
రూ.30 లక్షలు పైగా దోపిడీ
సీతానగరం: అధికారం అండగా కొండలను సైతం కరిగించేస్తున్నారు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా ఎర్రమట్టి తవ్వేసి.. వందలాదిగా టిప్పర్లతో తరలించుకుపోతున్నారు.. దీని వెనుక కొంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి. మండలంలోని నల్గొండ వద్ద కొండ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరం – సీతానగరం రోడ్డు బెర్ములకనే పేరుతో కొంత మంది అక్రమార్కులు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. కొండను పొక్లెయిన్తో పిండి చేసి, లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్నారు. గ్రావెల్ తవ్వకాలకు మైన్స్ అనుమతి ఉన్నప్పటికీ టిప్పర్లకు బిల్లులతోనే రవాణా చేయాలి. కానీ, ఇక్కడ ఎటువంటి బిల్లులూ లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొండ వద్ద ఒక్కో టిప్పర్ పొక్లెయిన్తో లోడింగ్కు సుమారు రూ.1,600 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా లోడ్ చేసిన టిప్పర్ గ్రావెల్ను బయట రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజూ సుమారు 150 టిప్పర్లతో గ్రావెల్ తరలించుకుపోతున్నారని సమాచారం. అలాగే, ట్రాక్టర్పై పొక్లెయిన్తో లోడింగ్కు రూ.600 వరకూ వసూలు చేస్తున్నారు. దీనిని బయట సుమారు రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఈవిధంగా ప్రతి రోజూ 100 ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా టిప్పర్లు, ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు గ్రావెల్ తరలిస్తూ రోజుకు సుమారు రూ.34 లక్షల వరకూ జేబుల్లో నింపుకొంటున్నారని సమాచారం. దీనిపై తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఒకచోట తవ్వకాలకు మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చినట్లు సమాచారముందని చెప్పారు. ప్రతి లారీకి బిల్లు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని చెప్పారు. రాత్రి వేళల్లో అక్రమ మైనింగ్పై స్థానిక ఎస్సై డి.రామ్కుమార్ను వివరణ కోరగా.. ఈ విషయాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సి ఉందని అన్నారు. గ్రామాల్లో అడ్డొస్తే తొక్కేస్తామనే రీతిలో టిప్పర్లు అతి వేగంగా దూసుకుపోతూండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాగే వదిలేస్తే ఈ కొండ ఏడాది కాలంలో కనుమరుగయ్యే ప్రమాదముందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ స్థానిక శ్యామల సెంటర్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. లేబర్ కోడ్ల నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ, నూతన లేబర్ కోడ్ల వల్ల యువత ఉద్యోగ భద్రత కోల్పోతుందన్నారు. పర్మినెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలతో అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్ మాట్లాడుతూ, భారత కార్మిక వర్గానికి ఇది చీకటి రోజని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పోరాటాన్ని ఉఽధృతం చేస్తామని అన్నారు.
కొండలు కరిగించేస్తున్నారు


