
ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫొటో జర్నలిస్టులకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫొటో జర్నలిస్ట్ అవార్డు–2025లను మంగళవారం అందించనుంది. ఈ మేరకు సీనియర్ ఫొటో జర్నలిస్టులు జీవీవీ ప్రసాద్ (సాక్షి), ఎస్బీ రాజేశ్వరరావు (ఆంధ్రజ్యోతి)ను ఎంపిక చేసినట్టు సంస్థ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించనున్నామన్నారు. క్లిష్టమైన సామాజిక, పర్యావరణ, సాంస్కృతిక పరిస్థితులు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నందుకు ఈ పురస్కారాలను అందిస్తున్నామని రాజా యోనా తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర
అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాకు చెందిన ఎండీ సత్యనారాయణ రెడ్డి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ను వెంకటరావు (పార్వతీపురం మన్యం జిల్లా)ను ఎన్నుకున్నట్టు సత్యనారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పక ఉండాలని, టెన్త్ విద్యా బోధనకూ తెలుగు మీడియం ఉండాలన్నారు. పరీక్షలకు బుక్లెట్ విధానం విపరీతమైన పనిభారం పెంచినట్టు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. త్వరలో వీటన్నింటిపై సమగ్ర నివేదికతో విద్యా శాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు.
తులాభారానికి త్రాసు సమర్పణ
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయానికి తోటపేటకు సత్తి సుబ్బారెడ్డి, సీతారత్నం దంపతులు ఆదివారం తులాభారం నిమిత్తం ఇత్తడి త్రాసును సమర్పించారు. ఈ తక్కెడను ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దీని విలువ రూ.1.50 లక్షలు కాగా, దాతను అర్చకులు సత్కరించి, స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
లోవకు భక్తుల తాకిడి
– రూ.4.33 లక్షల ఆదాయం
తుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో వంటలు, భోజనాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. టార్పాలిన్ను కట్టుకుని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,43,280, పూజా టికెట్లకు రూ.1,27,400, కేశఖండనశాలకు రూ.12,800, వాహన పూజలకు రూ.4,350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.96,216, విరాళాలు రూ.49,117 వెరసి మొత్తం రూ.4,33,163 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు.

ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు