
చంద్రబాబు సర్కార్.. రైతులను నట్టేట ముంచుతోంది
తాళ్లపూడి: ‘ఎక్కువ పంట పండించడం నేరమా? పండించిన ధాన్యం కూడా కొనుగోలు చేయలేని చేతకాని చంద్రబాబు ప్రభుత్వం.. రైతులను నట్టేట ముంచుతోంది’ అని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. మండలంలోని అన్నదేవరపేట, గజ్జరం రోడ్డులో కొద్ది రోజులుగా కొనగోలు చేయని రబీ ధాన్యం రాశులు, బస్తాల వద్ద వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యాన ఆయన గురువారం నిరసన తెలిపారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో 27,778 ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని, 1,16,667 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకూ 46,667 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. లక్ష్యంలో 40 శాతం మాత్రమే కొన్నారని, మిగిలిన ధాన్యం రైతుల వద్దనే చేలు, రోడ్లపై ఉందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు గోనెసంచులు కూడా ఇవ్వడం లేదని, తమ టార్గెట్ అయిపోయిందని మిల్లర్లు చెబుతున్నారని అన్నారు. ఎక్కువ పంట పండిందని అనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా రైతుల పక్షాన పని చేశారని, కానీ చంద్రబాబు రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. వ్యవసాయం దండగన్న నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ధాన్యం కొనలేమని పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులను దళారులు దోచుకుంటున్నారని వెంకట్రావు చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,725 ఉండగా, రూ.1,250 నుంచి రూ.1,300 వరకూ మాత్రమే కొంటున్నారని, ఫలితంగా రైతులు బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకూ నష్టపోతున్నారని అన్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోతున్నారని తెలిపారు. రైతుల సమస్యపై ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చామని, తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వెంకట్రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోశిరాజు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పిట్టా శ్రీనివాస్, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గూడా విజయరాజు, జిల్లా కార్యదర్శి వంబోలు పోశిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎక్కువ పండించడం రైతుల నేరమా?
ఫ తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలి
ఫ వైఎస్సార్ సీపీ నేత,
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు