అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, వారికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణరావుఽ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూండటంతో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరిట కొత్త డ్రామాకు తెర లేపారని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పార్టీ టీడీపీ వంచనపై ఈ నెల 27వ తేదీన రాజమహేంద్రవరం రూరల్ కాతేరు వెంకటాద్రి గార్డెన్స్లో వైఎస్సార్ సీపీ సీపీ ఆధ్వర్యాన ఉభయ గోదావరి జిల్లాల బీసీ గర్జన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు పోస్టర్లను అమలాపురం మండలం భట్నవెల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కుడుపూడి, బీసీ సంఘాల నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డికే దక్కుతుందని అన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారని గుర్తు చేశారు. అప్పటి వరకూ సామాన్యులకు అవకాశం దక్కని టీటీడీ పాలక మండలిలో సైతం బీసీలను సభ్యులుగా నియమించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా మెజార్టీ సీట్లు బీసీలకే ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పాలనలోనే బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కిందని అన్నారు. వెన్నుపోటు పార్టీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ముగ్గురు బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎం పదవికి ఒక్క బీసీ దొరకలేదా?
చంద్రబాబు ప్రభుత్వం బీసీల్లో ఒక్కరికీ ప్రాధాన్యం ఇవ్వలేదని సూర్యనారాయణరావు మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క బీసీ కూడా చంద్రబాబుకు దొరకలేదా అని నిలదీశారు. బీసీని డిప్యూటీ సీఎంను చేసి పక్కన కూర్చోబెట్టుకునేందుకు చంద్రబాబు ఇష్టపడకపోవడం దారుణమని అన్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల బీసీ గర్జన సదస్సును విజయవంతం చేసేందుకు జిల్లావ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు తరలి రావాలని కోరారు. ఈ సదస్సు నేపథ్యంలో ఈ నెల 20న అమలాపురంలో కోనసీమ బీసీ సెల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నిస్తే, టీడీపీ నేతలు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ 45 శాతం పైగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశమిచ్చిన గొప్ప నాయకుడు జగన్ అని కొనియాడారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసం చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ, వివిధ విభాగాల నాయకులు కుడుపూడి భరత్, జాన గణేష్, సంసాని నాని, గువ్వల రాజేష్, భరణికాన బాబు, గుబ్బల వీవీ సత్యనారాయణ, మట్టపర్తి శివ రాంబాబు, ఎంపీపీ శేషారావు, విత్తనాల మూర్తి, దొమ్మేటి రాము, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, బీసీ సంఘాల మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఫ రిజర్వేషన్ల పేరిట కొత్త డ్రామా
ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు విమర్శ
ఫ 27న రాజమహేంద్రవరంలో బీసీ గర్జన
ఫ విజయవంతం చేయాలని నేతల పిలుపు
ఫ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ


