గ్రోయిన్స్ నిర్మాణాల ముసుగులో అక్రమ రవాణా
అల్లవరం: మండలంలోని కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతం నుంచి సముద్ర ఇసుకను భారీ లారీల్లో యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాత్రి పది గంటల తర్వాత ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. అడ్డుకునేవారు లేకపోవడంతో పదుల సంఖ్యలో లారీల ద్వారా ఇసుకను తరలించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తయినా చూడకపోవడం గమనార్హం. అమలాపురం రూరల్కు చెందిన జనసేన నాయకుడు ఈ అక్రమ ఇసుక దందాను నిర్వహిస్తుండటం, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొమరగిరిపట్నంలోని కొంతమంది స్థానిక పెద్దలకు ఆలయ నిర్మాణాలకు గాను లక్షల్లో డబ్బులు అందాయని, దాని కారణంగానే స్థానికుల సహకారంతోనే ఇసుక దందా కొనసాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రోయిన్స్ నిర్మాణాల ముసుగులో దందా
ఓడలరేవు సముద్రంలో భారీ కెరటాల తాకిడికి తీరం కోతకు గురి కాకుండా ఓఎన్జీసీ నాలుగు కిలోమీటర్ల మేర తీరం నుంచి సముద్రంలోకి గ్రోయిన్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు కావాల్సిన గ్రానైట్ రాళ్లను రాజమహేంద్రవరం, రాజానగరం ప్రాంతాల నుంచి లారీల్లో ఓడలరేవు తీరానికి తరలిస్తున్నారు. గురువారం రాత్రి గ్రానైట్ రాళ్లు తీసుకొచ్చిన లారీలు డంపింగ్ అయిన తర్వాత వాటిలోనే తిరిగి ఇసుక లోడ్ చేసి అమలాపురం పరిసర ప్రాంతాలకు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై మైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఇసుక మాఫియాను సమర్ధించనని సీఎం చంద్రబాబునాయుడు ప్రగల్భాలు పలుకుతుంటే స్థానికంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కన్నసన్నల్లో ఇసుక దందా కొనసాగుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను నిలువరించకపోతే భవిష్యత్లో ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు పెను ప్రమాదం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


