పదేళ్లుగా మట్టి గణపతి బొమ్మల పంపిణీ
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఇరుసుమండకు చెందిన రైతుబిడ్డ వీరంశెట్టి సతీష్ గత పదేళ్లుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అంబాజీపేట, అమలాపురం ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో మట్టి గణపతినే పూజించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో జలాలు, మట్టి కలుషితమవుతున్నాయని, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ఆయన చెబుతున్నారు. ఈ ఏడాది వెయ్యి మట్టి విగ్రహాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.
మట్టి గణపతే.. పర్యావరణ హితం
ఆత్రేయపురం మండలం ర్యాలికి చెందిన చింతా శ్యామ్కుమార్–అన్నపూర్ణ దంపతులు అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 30 ఏళ్లుగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి విగ్రహాలను ఉచితంగా అందించనున్నారు. పీఓపీ విగ్రహాలతో కలిగే పర్యావరణ ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులతో గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు.


