● జగన్పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం
● ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అల్లవరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని, చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హెచ్చరించారు. పి.గన్నవరం మండలం మాచవరం పర్యటనలో చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గురువారం గోడిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటుకు నిదర్శనం చంద్రబాబేనని ఈ సందర్భంగా విమర్శించారు. 2025 మెగా డీఎస్సీ అంతా అక్రమాల పుట్టని చెప్పారు. ఈ డీఎస్సీ ద్వారా 372 ఉద్యోగాలు లోకేష్ అమ్ముకున్నాడని తెలిపారు. ఈ డీఎస్సీపై సీబీఐ విచారణ చేసి అక్రమాల నిగ్గుతేల్చాలని ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. ఏమీ కొనగలిగే పరిస్థితి లేక సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు. మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఎమ్మార్పీపై రూ.30, బెల్టుషాపుల ద్వారా మరో రూ.20 మద్యం ప్రియుల నుంచి దండుకుంటున్నారని విమర్శించారు. ప్రజల బాధలు పవన్కు పట్టవా అని ప్రశ్నించారు.
చెప్పుతో కొట్టించుకోవడానికా మీకు ఓట్లేసింది?
వరి చేలకు సాగు నీరు పారడం లేదని అడిగిన రైతును స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు చెప్పుతో కొడతామని అనడం ఇదేనా పాలన అని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ నిలదీశారు. చెప్పుతో కొట్టించుకోవడానికేనా మీకు ఓట్లు వేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అమ్మకుని అవినీతికి పాల్పడుతున్నా మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఓడలరేవు గ్రోయిన్స్ నిర్మాణాల ముసుగులో ఇసుక అమ్ముకుని టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల ముసుగులో రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్ల మంజూరు చేపట్టారని, ఇది కేవలం ఎన్నికల స్టంటేనని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ఇజ్రాయిల్ ఆయన ధీమా వ్యక్తం చేశారు.


