అంబాజీపేట: జిల్లాలో కొత్తగా రైతుల భూములు రీ సర్వే చేసినప్పుడు పాస్ పుస్తకాల్లో వివరాలు నమోదు చేసే క్రమంలో అనేక అవకతవకలు జరిగాయని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు, రైతులు కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంబాజీపేట శివారు పండువారిపేటలో బుధవారం జరిగిన సీఎం చంద్రబాబు సభా ప్రాంగణంలోని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎక్కువ మంది రైతులకు వారి పూర్వార్జిత ఆస్తి, దఖలు పడిన ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్ రీత్యా సర్వే జరగలేదన్నారు. వారి డాక్యుమెంట్లో ఉన్న ఆస్తికి 5 నుంచి 15 సెంట్లు తక్కువగా చూపించడం వలన ఎక్కువగా నష్టపోయారన్నారు. సర్వేయర్లు భూములు కొలిచే సమయంలో ఫీల్డ్ మీద రైతులకు భూముల కొలతలు తెలియజేయలేదన్నారు. దీనివలన రైతుకు తన భూమి ఎంత ఉందో ముందుగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. సరిహద్దు రాళ్లు కొద్దిగా తవ్వించి చూపించే అవకాశం కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. కొంత మంది రైతులకు రీసర్వేపై అవగాహన లేదని, నష్టపోయిన వారికి మళ్లీ రీ సర్వే చేసి వారి ఆస్తి డాక్యుమెంట్ సరి చేయాలని డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల లంచాలు ఇవ్వకపోతే సర్వేయర్లు కూడా భూముల విస్తీర్ణం సరిగ్గా నమోదు చేయడం లేదని ఆరోపించారు. తద్వారా రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. రైతుల దస్తావేజులు పరిశీలించి, పాస్ పుస్తకాలు సరి చేసి పంపిణీ చేయాలని కోరారు.


