మామిడికుదురు: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’ చిత్రంలో తనదైన నటనతో మెప్పించి, ప్రేక్షకుల గుండెల్లో ‘ఛత్రపతి శివాజీ’గా చెరగని ముద్ర వేసుకున్నారు ప్రముఖ సినీనటుడు చంద్రశేఖర్ (ఛత్రపతి శేఖర్). రాయలసీమ గడ్డ అయిన కర్నూలు జిల్లా హుస్సేనాపురానికి చెందిన శేఖర్, ప్రస్తుతం లహరి క్రియేషన్స్ పతాకంపై కోనసీమ జిల్లా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘అనగనగా తూర్పులంకలో‘ అనే చిత్రంలో హీరోయిన్ గగన తండ్రిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగులో పాల్గొనేందుకు వచ్చిన ఛత్రపతి శేఖర్ బుధవారం మామిడికుదురులో ‘సాక్షి’తో ముచ్చటించి, తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
సెంచరీ కొట్టేశా.. ఏ పాత్రకై నా రెడీ!
‘పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ 100కు పైగా చిత్రాల్లో నటించాను. నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రనైనా చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడానికి వెనుకాడను. ‘నాకు ప్రేక్షకులు అందించే ఆదరాభిమానాలే అన్నిటి కంటే పెద్ద రివార్డులు. అంతకు మించి నాకు వేరే అవార్డులు రావలసిన అవసరం లేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ’శేఖర్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు’ అని సినీ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. ఆ అనుభూతిని మించిన పురస్కారం ఒక నటుడికి ఇంకేముంటుంది?‘ అని శేఖర్ స్పష్టం చేశారు. కోనసీమ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇక్కడి ప్రజలు చూపించే ఆదరాభిమానాలు, ఆప్యాయతలు ఎంత పొడిగినా తక్కువేనని శేఖర్ స్పష్టం చేశారు.
‘ఛత్రపతి’ శేఖర్తో ‘సాక్షి’ ముఖాముఖి


