రాజానగరం: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను సమర్థంగా నిర్వహించేందుకుగాను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)తో కలిసి ‘గోదావరి పుష్కర ప్రాజెక్టు’ను రూపొందించినట్టు అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, కాలిఫోర్నియాలోని సొనోమా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం జీజీయూను సందర్శించిన వారు ఈ విషయాలను తెలియజేశారు. నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చించామన్నారు. వర్సిటీ ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉజ్వల భవితకు..
విద్యార్థులకు ఉజ్వల భవిత అందించే సంకల్పంతో తమ వర్సిటీ అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉభయ సంస్థల ప్రతినిధులు చర్చించుకుని, పరస్పర అవగాహన పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్, జీజీయూ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


