సాక్షి, అమలాపురం: పుర పోరుకు సర్వం సిద్ధమవుతోంది. మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించడంతో జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. ఓటర్ల జాబితాల రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వచ్చే నెల 3లోగా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించే అవకాశం ఉండటంతో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి పెరుగుతోంది. సెప్టెంబరు – అక్టోబర్లలో ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఆశావహుల్లో ఆశలు
ఎన్నికలపై ప్రభుత్వం వరుస ప్రకటనలు చేస్తుండడంతో ఆశావహుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే పలువురు నాయకులు తమకు అనుకూలమైన వార్డులను గుర్తించి రాజకీయ సమీకరణాలపై లెక్కలు వేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న దానిపైనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ సాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే చాలామంది పోటీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈసారి తమకు అవకాశం దక్కుతుందనే ఆశతో పలువురు ఆశావహులు స్థానిక పెద్దలు, సామాజికవర్గాల ప్రతినిధులను కలుస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారుల కసరత్తు ముందుకు సాగుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లోనూ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి. గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన వారు మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, మహిళలు కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.
అంతటా కోలాహలం
జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్నాయి. అమలాపురం మున్సిపాలిటీలో 30 వార్డులు, రామచంద్రపురం మున్సిపాలిటీలో 30 వార్డులు, ముమ్మిడివరం నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. వీటి పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావడంతో కొత్త పాలకవర్గాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అంతటా కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
మున్సిపల్, నగర పంచాయతీ
ఎన్నికలకు కసరత్తు
ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్లపై దృష్టి
వచ్చే నెల 3లోగా వార్డుల వారీగా
ఓటర్ల జాబితాల ప్రకటన


