ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం): వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులు మార్పిడి చేసి ఘరానా మోసాలకు పాల్పడుతున్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం ప్రాంతానికి చెందిన పల్లా సురేంద్రకుమార్ (30)ను ఎంవీపీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.93 లక్షల నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్రకుమార్ ఏటీఎం కేంద్రాల వద్ద ఉండి, ముఖ్యంగా వృద్ధులు డబ్బులు తీసేందుకు వచ్చినప్పుడు సహాయం చేస్తానంటూ వారి వెంట వెళ్లేవాడు. ఆ సమయంలో వారి ఏటీఎం కార్డును చాకచక్యంగా దొంగిలించి, అదే బ్యాంకుకు చెందిన మరో కార్డును వారికి ఇచ్చేవాడు. ముందుగానే బాధితుల పిన్ నంబర్ తెలుసుకుని, వారు వెళ్లిపోయిన వెంటనే అసలు కార్డుతో నగదు డ్రా చేసి పరారయ్యేవాడు. బాధితులు తమ కార్డు మారిపోయిందని గుర్తించేలోపే అక్కడి నుంచి తప్పించుకుని ఈ తరహాలో పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే 60 కేసులు ఉన్నాయి. ఇటీవల ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దిలపాలెం ఎస్బీఐ ఏటీఎం, సీతమ్మధార అల్లూరి విగ్రహం సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం, అల్లిపురం, గాజువాక, తుని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.


