ఆత్రేయపురం: కట్టుంగ గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం యుద్ధ ప్రాతిపదికన కొత్త ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ఏర్పాటు చేశారు. గురువారం ‘సాక్షి’ దినపత్రికలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రైతుల ఇక్కట్లు’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్థానిక ఎలక్ట్రికల్ ఏఈ టి.అశోక్ స్పందించి తమ సిబ్బందితో కట్టుంగ పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. సుమారు 20 ఎకరాలకు పైగా వరి పంట సాగు చేసే భూములకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు తణుకు బ్రహ్మానందం, చేకూరి రంగరాజు, వెంగళ రాజు, జుజ్జువరపు రాధాకృష్ణులు హర్షం వ్యక్తం చేశారు.
పనులు వేగవంతం
చేయండి: జేసీ
అమలాపురం రూరల్: గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథకం పనులు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, జిల్లాలో ప్రజలకు సంపూర్ణంగా తాగునీటిని అందించాని జేసీ వైఖోం నైదియాదేవి ఆదేశించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జల్జీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు 25 శాతం పూర్తయ్యాయని జేసీ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏవీఎస్ రాజన్, డీఈలు పద్మనాభం, రవీంద్ర, పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి, జల వనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పరిచారకుడికి తిరిగి పోస్టింగ్
అన్నవరం: రత్నగిరి తొలి పావంచా వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేతి డబ్బాలు అపహరించేందుకు ప్రయత్నించిన అర్చకుడికి సహాయం చేశాడనే అభియోగంతో సస్పెండైన పరిచారకుడు ఎన్ఎస్ఎస్ కృష్ణకుమార్కు ఏడాది తరువాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ బి.మహేష్రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జూలై 17న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సుమారు రూ.20 వేల విలువైన మూడు ఆవునేతి డబ్బాలను అర్చకుడు సీహెచ్ హరగోపాల్ అపహరించే ప్రయత్నం చేస్తున్నాడనే సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా కనకదుర్గ గుడి దిగువన ఉన్న మూడు ఆవునేతి డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా హరగోపాల్, కృష్ణకుమార్లను సస్పెండ్ చేశారు. నాలుగు నెలల క్రితం హరగోపాల్కు తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా కృష్ణకుమార్కు కూడా తిరిగి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సత్యదేవునికి
ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: జ్యేష్ట బహుళ ఏకాదశి సందర్బంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి శుక్రవారం ఉదయం 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన, కుంకుమార్చనలు జరిపారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.


